Tuesday, February 2, 2010

మనం బ్రతుకుతుంది మనుషల మధ్యేనా!?

మూడు రోజుల క్రితం కిడ్నాప్ కి గురైన వైష్ణవి చనిపోయిందని తెలియగానే చాలా బాధనిపించింది. కానీ తనని ఎలా చంపారో తెలిసాక చాలా కోపమొచ్చింది. అసలు వాళ్ళు మనుషులేనా అని అనుమానమొచ్చింది. మరీ ఇంత దారుణమా! మనం బ్రతుకుతుంది మనుషల మధ్యా లేక మృగాల మధ్యా? అడవిలో తిరిగే మృగాలు కూడా ఆకలేస్తేనే మరో జంతువుని చంపుతాయి. కానీ వీళ్ళు? కేవలం ఆస్తి తగాదాల వలన నిండా పది ఏళ్ళు కూడా నిండని పసిపాపని అంత దారుణంగా... ఛా. అసలు వాళ్లకి చేతులెలా వచ్చాయో! తనని ఎవరు ఎందుకు హింసిస్తున్నారో కూడా తెలియని ఆ చిన్నారి చివరి క్షణాల్లో ఎంత నరకం అనుభవించి ఉంటుందో తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగటం లేదు. ఆ పాపని అంత దారుణంగా చంపటం వలన వాళ్ళు ఏం సాధించారు? వాళ్ళ గొడవలుతీరిపోయాయా? వాళ్ళ ఆస్తి వాళ్లకి వచ్చేసిందా? అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి?

పాపం... ఆ పాప గురించిన వార్త తెలియగానే ఆ తండ్రి కుప్ప కూలిపోయారు. పాప మరణ వార్త విని షాక్ లోకి వెళ్ళిన ఆ తల్లికి మరో షాక్... ఆ తండ్రి మరణ వార్త. ఇంతటి దారుణాన్ని చేసిన ఆ దుర్మార్గులకి (ఈ పదం సరిపోదు) ఎలాంటి శిక్ష వేయాలి? కేవలం ఉరి తీస్తే సరిపోదు. క్షణక్షణం నరకం అనుభవించే శిక్ష వేయాలి. ప్రతి క్షణం వాళ్లు చేసిన తప్పు గుర్తొచ్చి నరకం అనుభవించేలా శిక్షించాలి.
కేవలం డబ్బు కోసం ఇంతటి హేయమైన పని చేయించిన, చేసిన వాళ్ళని అస్సలు వదలకూడదు. నాలుగు రోజులు దీని గురించి మాట్లాడి, తర్వాత మర్చిపోకుండా ఆ మృగాలకి తగిన శిక్ష వేసే వరకు వదిలిపెట్టకూడదు.

ఇంత దారుణాన్ని కూడా వ్యాపార దృష్టితో చూసే ఈ న్యూస్ చానల్స్ ని ఏం చేయాలి? వైష్ణవి మరణం పై sms కాంటెస్ట్ పెడుతున్న వీళ్ళు మాత్రం మనుషులా? ఆ హంతకులకి, వీళ్ళకి ఏంటి తేడా?

వైష్ణవి అన్న ఆ కిరాతకుల భారిన పడకుండా తప్పించుకోగాలిగాడు. ఆ బాబు కోసం, కనీసం వైష్ణవి తల్లైనా షాక్ నుండి తేరుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆశ.